న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్నది. కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయికి పెరుగడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల కొరత వల్ల కొందరు రోగులు చనిపోయారు. మరోవైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారినపడుతున్నారు. ఒక్క సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే నెల రోజుల్లో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో పలువురు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు.
కాగా, 58 ఏండ్ల డాక్టర్ ఏకే రావత్ కరోనాతో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. దీంతో ఆయన మరణాన్ని ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నది. డాక్టర్ రావత్ చాలా ధైర్యవంతులని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీకే భరద్వాజ్ గుర్తు చేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆయన మహమ్మారితో పోరాడుతానంటూనే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా మెరుగుపడిందని, అయితే తర్వాత సరఫరా ఎప్పుడు అందుతుంది అన్నదానిపై ఆందోళన ఉందన్నారు.