న్యూఢిల్లీ, మే 13: టెలికం కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారులు వ్యక్తంచేసిన ఆందోళనలు, వారు చేసిన ఫిర్యాదులను పురస్కరించుకుని, టెలికం నియంత్రణా సంస్థ ట్రాయ్ గురువారం ఒక చర్చాపత్రాన్ని జారీచేసింది. నెలరోజుల పరిమితి బదులు 28 రోజుల పరిమితిపై టెలికం కంపెనీలు ప్రస్తుతం రిఛార్జ్ టారీఫ్ ఆఫర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. వివిధ మార్గాల ద్వారా అందిన ఫిర్యాదుల ప్రకారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీలు) అందిస్తున్న కొన్ని రీఛార్జ్ టారీఫ్లు/ఓచర్లు చాలామంది వినియోగదారులకు సంతృప్తికరంగా లేవని ట్రాయ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. నెలకు బదులు 28 రోజుల ఓచర్ల కారణంగా సంవత్సరానికి 12 బదులు 13 రీఛార్జ్లు చేయించుకోవాల్సివస్తున్నదని, తాము మోసపోతున్నామని ప్రిపెయిడ్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ట్రాయ్ పేర్కొంది. పోస్ట్పెయిడ్ వినియోగదారులకు నెలల వారీగా టీఎస్పీలు ఆఫర్లు ఇస్తుండగా, ప్రిపెయిడ్ వినియోగదారులకు మాత్రం బహుళప్రాచుర్యం పొందిన ఓచర్లను రోజులు, వారాల ప్రాతిపదికన 28/56/84 రోజుల కాలపరిమితితో నిర్ణయిస్తున్నాయని ట్రాయ్ తెలిపింది. ఈ కాలపరిమితి వివాదంపై జోక్యం చేసుకోవాలా? లేక అనుమతించాలా, టెలికం కంపెనీలు అందించే రీఛార్జ్ ఆఫర్ల టారీఫ్లు, వాటి కాలపరిమితులు, వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం అనే అంశాలపై ప్రజలు, పరిశ్రమ నుంచి సూచనలు కోరుతూ ట్రాయ్ తాజాగా చర్చాపత్రాన్ని జారీచేసింది. దీనిపై వాఖ్యానాలకు జూన్ 11, ప్రతివ్యాఖ్యానాలకు జూన్ 25 గడువులోగా ట్రాయ్ నిర్ణయించింది. ఆఫర్ల కాలపరిమితిపై టీఎస్పీలకు ఆదేశాలివ్వాలా, సూచనలివ్వాలా? ఒక ఆఫర్ను నెల పరిమితిగానా లేక 30 రోజుల పరిమితిగా జారీచేయాలా? ప్రస్తుత 28 రోజుల ఆఫర్లతో పాటు ప్రతీ నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే కాలపరిమితిగల ఓచర్లను అందించాలా? నెలవారీ ఆఫర్ల తరహాలో మూడు నెలలు, ఆరునెలలు , ఏడాది కాలాలకు ప్రీపెయిడ్ టారీఫ్ ఓచర్లు ఇవ్వాలా?….ఇలాంటి వివిధ అంశాలపై వ్యాఖ్యానాల్ని ట్రాయ్ ఆ చర్చాపత్రంలో కోరింది.