కేరళ రాష్ట్రంలో ఐదేండ్లకోసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అధికారంలోకి వస్తుంటాయి. ప్రతి ఐదేండ్లకోసారి ప్రజలు మార్పును కోరుకుంటారని ఇప్పటివరకు అనుకునేవారు. ఆ ఆనవాయితీకి ఇప్పుడు తిలోదకాలిచ్చారు. ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి తెరపడింది. 1980 నుంచి కేరళలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతూనే ఉన్నది. అయితే, ప్రస్తుతం ఈ సంప్రదాయానికి మలయాళీలు స్వస్తి పలికినట్లు ప్రస్తుత ఎన్నికల సరళిని బట్టి తెలుస్తున్నది.
లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘోర పరాజయం మూటగట్టుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలో కరోనా కట్టడికి విజయన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం మోడల్గా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయానికి ముఖ్యమంత్రి విజయన్ చరిష్మా ప్రధాన కారణంగా నిలిచిందని వామపక్ష కార్యకర్తలు బాహాటంగా చెప్తుంటారు. కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపిన బంగారం అక్రమ రవాణా కుంభకోణంలో అరెస్టులు, సోదాలు.. విజయన్ ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తాజా ఫలితాలతో రుజువైంది.
మన దేశంలో తొలి కమ్యూనిష్టు ప్రభుత్వం కేరళలో ఏర్పడింది. 1957లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడగా.. ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ సీఎంగా ఎన్నికయ్యారు. 1960 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1965 ఎన్నికల్లో తిరిగి వామపక్షాలు విజయం సాధించి అధికారం చేపట్టాయి. ఆ తర్వాత 1970 నుంచి కాంగ్రెస్ కూటమిలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 1980 లో సీపీఎం అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఐదేండ్లకూ జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ పరంపరను పినరయి విజయన్ అధిగమించి కొత్త చరిత్రను లిఖించారు.
2006 లో మరోసారి సీపీఎం అధికారాన్ని చేజిక్కించుకున్నది. అప్పటి నుంచి పూర్తికాలం పాటు వీఎస్ అచ్యుతానందన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011 ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రెండు, మూడు సీట్ల దూరంలో ఉండిపోగా.. 2011 నుండి 2016 వరకు యూడీఎప్ కేరళలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2016 లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించింది.
అయితే, ఈసారి అచ్యుతానందన్ను పక్కనబెట్టిన పార్టీ పెద్దలు.. పినరయి విజయన్ను సీఎంగా ఎంపిక చేశారు. కేరళ వరదలు, కరోనా సంక్షోభంలో ఆయన పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమయ్యింది. అందుకు ఈ ఎన్నికల్లో ఘన విజయమే నిదర్శనం.
కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్ ప్రజల్లో ఎంతో పేరు గడించారు. ఇటీవల ఏబీపీ-సీఓటర్ నిర్వహించిన సర్వేలో విజయన్ పట్ల ప్రజలు ఎంత మేర సంతృప్తికరంగా ఉన్నారనేది తేలింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 48 శాతం మంది విజయన్ పనితీరు అద్భుతంగా ఉన్నదని పేర్కొన్నారు. కాగా, ఆయన పనితీరు చాలా బాగుందని 35 శాతం, సంతృప్తికరంగా ఉన్నదని 16 శాతం మంది చెప్పగా.. 0.1 శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. అంతేగానీ ఆయనపై వ్యతిరేకత మాత్రం ఎక్కడా కానరాలేదంటే ఆయనకు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతున్నది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పినరయి విజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్కు అయ్యప్పస్వామి దీవెనలు ఉన్నాయని చెప్పారు. అయ్యప్పతోపాటు ఈ నేలపై ఉన్న ఇతర మత విశ్వాసాలకు చెందిన దేవుళ్లు కూడా తమ ప్రభుత్వాన్ని దీవిస్తారని పినరయి అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలను రక్షిస్తున్నందున.. దేవుడు తమ పార్టీని రక్షిస్తాడని, అన్ని మతాల దేవుళ్ల దీవెనలతో మరోసారి అధికారంలోకి వస్తాం అని పేర్కొన్నారు.
అమ్మను బతికించుకోవాలని.. నోటితో ఆక్సిజన్ అందించిన కూతుర్లు
రాజస్థాన్ ఉప ఎన్నిక : రెండింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ గెలుపు
జార్ఖండ్ ఉప ఎన్నిక : మధుపూర్లో జేఎంఎం ఆధిక్యం
ఉత్తరాఖండ్ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..