కోజికోడ్: కేరళలో నిపా వైరస్ సోకి ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడితో కాంటాక్ట్లోకి వచ్చిన వారి శ్యాంపిళ్లను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపారు. మొత్తం 24 నాలుగు శ్యాంపిళ్లు పంపగా.. అందులో 8 మంది శ్యాంపిళ్లు నెగటివ్గా తేలినట్లు ఇవాళ కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరిన్ని శ్యాంపిళ్లను కూడా టెస్టింగ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆ ప్రాంతం అంతా నిఘా పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఇంటి ఇంటిని సర్వే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంటేన్మెంట్ జోన్లలోను తీవ్ర రీతిలో సెర్చ్ చేస్తున్నారు.
ఇటీవల మరణించిన బాలుడితో దగ్గరి సంబంధాలు ఉన్న ఆ 8 మంది నెగటివ్ రావడం కొంత ఊరటనిచ్చే అంశమని మంత్రి చెప్పారు. ఇందులో ఆ బాలుడి పేరెంట్స్, హెల్త్కేర్ వర్కర్లు ఉన్నారు. మరో ముగ్గురి శ్యాంపిళ్లను పరీక్షకు పంపినట్లు తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలోనే ఆ శ్యాంపిళ్లను పరీక్షిస్తున్నారు. నిపాతో చనిపోయిన బాలుడితో సుమారు 251 మంది కాంటాక్ట్లోకి వచ్చినట్లు అధికారులు ఓ లిస్టు తయారు చేశారు. 30 మంది హెల్త్ కేర్ వర్కర్లను హై రిస్క్ జాబితాలో చేర్చారు. ఇప్పటికే 38 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు.. కోజికోడ్ మెడికల్ కాలేజీలో తాత్కాలిక టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇది కొంత ఉపశమనం కలిగించే వార్త. అయితే అక్కడ టెస్ట్ చేసిన శ్యాంపిళ్లకు మళ్లీ పుణె ఇన్స్టిట్యూట్లో రీటెస్టింగ్ చేయనున్నారు. కోజికోడ్ టెస్టింగ్ ఫలితాలను కేవలం డాక్టర్లను అలర్ట్ చేసేందుకు ఉపయోగించనున్నారు. పుణెలో పరీక్ష పూర్తి అయిన తర్వాతే తుది ఫలితం వెల్లడించనున్నారు.