న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక చాలా చోట్ల కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఢిల్లీలోని బాత్రా దవాఖానలో శనివారం ఉదయం ఆక్సిజన్ అందక వైద్యుడితో సహా 8 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. వారంరోజుల వ్యవధిలో రెండోసారి ఇక్కడ ఇదే తరహా ఘటన జరగడం ఆందోళన రేకెత్తిస్తున్నది.
మృతి చెందిన 8 మందిలో ఆరుగురు ఐసీయూలో మరో ఇద్దరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మృతి చెందిన డాక్టర్ను అదే ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజీస్ట్ హెడ్ డాక్టర్ ఆర్కే హింథానిగా గుర్తించారు. వరుసగా 11వ రోజు ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.
ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 230 మంది రోగులకు 80 నిమిషాల పాటు ఆక్సిజన్ అందలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఆక్సిజన్ కోసం పరుగులు తీయడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపింది.
గత నెల 24న ఇదే దవాఖానలో ఆక్సిజన్ నిలువలు అయిపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. చివరి నిమిషంలో తిరిగి సరఫరాను పునరుద్ధరించింది.
కరోనా చాలా తీవ్రంగా ఉందని రోగుల అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి చెందిన పలువురు వేడుకున్నారు.
ఘటనపై ఢిల్లీ హైకోర్టు కేంద్రం తీరుపై తీవ్రంగా స్పందించింది. “మనం చేసేది వ్యాపారం కాదు.. ప్రజారోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కటి సమకూర్చాలి. ఢిల్లీలో ప్రజల ప్రాణాలు పోతుంటే కళ్లు మూసుకుంటున్నారా”.! అని న్యాయం స్థానం ప్రశ్నించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.