పాట్నా : నాటు సారా తాగి 8 మంది మృతి చెందిన ఘటన బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్లో 2016, ఏప్రిల్ నుంచి మద్యం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం బాబులు నాటు సారాకు బానిస అయ్యారు. జులై 13, 14 తేదీల్లో లావురియా, రామ్నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన వ్యక్తులు నాటు సారా తాగారు. ఆ తర్వాత 8 మంది చనిపోయారు. ఈ విషయం బయటకు తెలియకుండా వారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషయం పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దియోరాజ్ ప్రాంతంలో బట్టీలు ఏర్పాటు చేసి నాటు సారా తయారు చేస్తున్నారని తేలింది. 2016, ఆగస్టు నెలలో గోపాల్గంజ్ జిల్లాలో నాటు సారా తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.