సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ), బన్సీలాల్పేట్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంలో భాగంగా జీవై రెడ్డి కంపౌండ్ వద్ద కొత్తగా నిర్మించిన 180డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం లబ్ధిదారులకు అందించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ వాణీదేవి హాజరుకానున్నారు.
గతంలో పూర్తిగా బస్తీలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్లలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు. కాగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్లలో ఒక లివింగ్ రూం, రెండు బెడ్రూంలు, ఒక కిచెన్ రూ మ్, రెండు టాయిలెట్లు, మూడు లిఫ్టులు, ఆరు షాపులు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.8.65లక్షల వ్యయంతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.