వరంగల్ రూరల్ : అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి సూమారు పది లక్షల విలువగల వంద కిలోల గంజాయితో పాటు గంజాయి రవాణాకు వినియోగిస్తున్న కారు, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
భద్రాచలం సరిహద్దులోని కుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నిందితులు వంద కిలోల గంజాయిని కోనుగోలు చేసి కారులో కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ మీదుగా తొర్రూరకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్ఫోర్స్ పోలీసులు వర్ధన్నపేట పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు.
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని రాజరాజేశ్వరి దేవాలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. తోర్రూర్ నుంచి వరంగల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనం, కారులో వస్తున్న ముగ్గురు నిందితులు పోలీసులను గమనించిన తప్పించుకోనేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.
వాహనాలను తనిఖీ చేయడంతో కారులో గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించి నిందితులు కొండిశెట్టి సత్యనారరాయణ, జగదీశ్, ఇస్లావత్ వినోద్ కుమార్, ఆజ్మీరా రమాదేవిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
ధాన్యం కొనుగోలు పూర్తయ్యాక మళ్లీ తరుగుతీస్తే చర్యలు