మెదక్, ఏప్రిల్ 26: కరోనా రోగులపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా మానవతాదృక్పథంతో వైద్యం అందించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వైద్యులు, సిబ్బందికి సూచించారు. దవాఖానలో నర్సుల కొరత చాలా ఉన్నదని, ఇదివరకే ఎంపిక చేసిన 35 మంది నర్సులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నందున వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ కలెక్టర్ హరీశ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి జిల్లా కేంద్ర దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కరోనా వార్డును, లేబర్ వార్డులతో పాటు ఇతర వార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రామాయంపేటలో ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించామని, జిల్లా కేంద్రంలో కూడా పిల్లికోటల్లోని డబుల్ బెడ్రూపం ఇండ్లల్లో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ, కరోనా రోగులు రావడం లేదని, వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
జిల్లా కేంద్ర దవాఖానలో 28 మంది కరోనా రోగులకు గానూ రెండు షిఫ్టుల్లో ఇద్దరు నర్సులు మాత్రమే పనిచేస్తున్నారని, నర్సుల కొరత బాగా ఉన్నందున వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఫోన్లో కోరారు. గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించే కిట్ ప్రస్తుతం అందుబాటులో లేదని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రి ఈటెల రాజేందర్తో కూడా మాట్లాడతానని తెలిపారు. కరోనా వైద్యంపై, సమస్యలపై డ్యూటీ డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో షటీల్ బ్యాడ్మింటన్ ఉడెన్ కోర్టు పనులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పరిశీలించారు. ఆమెవెంట జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ నాయకులున్నారు.