రాష్ట్రంలో సాధారణ స్థితికి టూరిస్టుల తాకిడి
వారాంతాల్లో వేలసంఖ్యలో సందర్శకుల సందడి
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటకరంగం క్రమంగా కోలుకుంటున్నది. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. గతేడాది కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా పర్యాటకులు లేక వెలవెలబోయిన ప్రముఖ చరిత్రాత్మక స్మారక చిహ్నాలు, ప్యాలెస్లు, పార్కులు, బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ప్రాంతాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో విదేశీ యాత్రికులు రాకపోయినా.. స్థానిక పర్యాటకుల సందడి పెరిగింది. వారాంతాల్లో రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో రూ.లక్షల ఆదాయం వస్తున్నది.
ప్రస్తుతం లక్నవరం సరస్సుకు రోజూ 2,000 నుంచి 2,500 మంది పర్యాటకులు వస్తున్నారు. వారాంతాల్లో రూ.లక్ష ఆదాయం సమకూరుతున్నది. కరోనాకు ముందు ఇక్కడికి రోజూ 1500 మంది వచ్చేవారు. లక్నవరం సమీపంలోని రామప్ప, తాడ్వాయి హట్స్కు సైతం సందర్శకుల తాకిడి పెరిగింది.
హైదరాబాద్లోని లుంబినీ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్ మొదలైన ప్రదేశాలకు రోజూ వేలమంది వస్తున్నారు.
నాలుగు వారాలుగా లుంబినీ పార్కును ప్రతిరోజు 4 వేలమంది సందర్శిస్తున్నారు. వారాంతాల్లో 10 వేల మంది దాటుతున్నారు. వారాంతాలు, సెలవురోజుల్లో లుంబినీ పార్కునుంచి టూరిజం కార్పొరేషన్కు రూ.5 లక్షల ఆదాయం సమకూరుతున్నది. సాలార్జంగ్ మ్యూజియానికి నెల రోజులుగా రోజుకు 2 వేల మందికి తగ్గకుండా సందర్శకులు వస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కును సాధారణ రోజుల్లో 3 వేల నుంచి 3,500 మంది, వారాంతాల్లో 15 వేలమంది సందర్శిస్తున్నారు.
పర్యాటకులు మాస్కులు ధరించాలి
లాక్డౌన్ ముగిశాక రెండు నెలలు పర్యాటక ప్రాంతా లు వెలవెలబోయాయి. ఆ తర్వాత క్రమంగా సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇంత వేగంగా కోలుకుంటుందని అనుకోలేదు. విదేశీయులు రాకపోయినా లాక్డౌన్కు ముందు సాధారణ రోజుల మాదిరి ఆదాయం వస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పర్యాటకులు మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొవిడ్-19 నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.