ముంబై: కరోనా బారిన పడిన ఒక వృద్ధురాలు అచేతనంగా ఉండటంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. మహారాష్ట్ర బారామతిలోని ముధలే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 76 ఏండ్ల శకుంతల గైక్వాడ్కు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఇంట్లో హోం ఐసొలేషన్లో ఉంచారు. అమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 10న కారులో బారామతిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పడకలు లేక అడ్మిట్ చేసుకోలేదు.
ఇంతలో ఆ వృద్ధురాలు కారులో అచేతనంగా కదలకుండా ఉన్నది. దీంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాడె మీద పడుకోబెట్టారు. బంధువులు పెద్దగా ఏడ్వగా ఆ ముసలావిడ ఒక్కసారిగా కళ్లు తెరిచి ఏడ్వసాగింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ఆమెను బారామతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ఆ వృద్ధురాలు చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.