న్యూఢిల్లీ: రానున్న 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశం నలుమూలలను కలుపుతాయి’ అని చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ రైళ్లను కనీసం పది నగరాల్లో నడిపేందుకు రైల్వే సిద్ధంగా ఉన్నదని అన్నారు. 2022 ఆగస్ట్ నాటికి ఈ రైళ్లు 40 నగరాలను కలుపుతాయని చెప్పారు.
కొత్త విమానాశ్రయాల నిర్మాణ వేగాన్ని పెంచుతున్న ఉడాన్ పథకం మాదిరిగా దేశంలోని సుదూర ప్రాంతాల అనుసంధానానికి సహకరించే వందే భారత్ రైళ్లు అపూర్వమైనవని ప్రధాని మోదీ కొనియాడారు. ‘ఈశాన్య రాష్ట్రాల అనుసంధానంలో కొత్త చరిత్ర వ్రాయబడుతోంది. ఈశాన్య రాష్ట్రాల అన్ని రాజధానులను రైలు సేవలతో అనుసంధానించే పనులు అతి త్వరలో పూర్తవుతాయి’ అని అన్నారు. అంతేగాక ఈస్ట్ ఈస్ట్ పాలసీ ప్రకారం, బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలు అనుసంధానమవుతాయని చెప్పారు. భారతదేశం కొత్త ప్రతిజ్ఞలతో రాబోయే 25 ఏండ్ల వరకు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.