మియాపూర్, మార్చి 29 : చెరువులను కాపాడి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు తమ ప్రభుత్వం తగినన్ని నిధులను మంజూరు చేస్తున్నా.. ఆ పనులను సకాలంలో చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని దీనివల్ల చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలతో సమీప ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. పనులలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అంబీర్ చెరువు సుందరీకరణ పనులపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్ సహా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ వివేకానందనగర్లోని ఆయన నివాసంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరీకరణకు సంబంధించి అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా పనులు ముగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలు సమన్వయంతో పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా ముగించాలని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నరేందర్, డీఈ నరేందర్, ఏఈ విశ్వం, గుత్తేదారు రమణారెడ్డి, కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.