లక్నో: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రోగుల్లో కొన్ని లక్షణాలుంటున్నాయి. ఇవి కొన్ని నెలలపాటు ఉండే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సివిల్ హాస్పిటల్లో కోవిడ్ అనంతర లక్షణాలున్న రోగుల కోసం ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రోగుల్లో బలహీనత, శ్వాస సంబంధ సమస్యలు ఉంటున్నాయని డాక్టర్ బీఆర్ జైస్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పరీక్షలు నిర్వహించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలున్నవారి కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇండ్లకు వెళ్లిన వారికి అనంతర వైద్య సేవల కోసం ఔట్ పేషంట్ విభాగాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.