న్యూఢిల్లీ, జూన్ 16: డీఏపీ ఎరువుపై సబ్సిడీని కేంద్రం రూ.700 పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తాపై సబ్సిడీ ప్రస్తుతం రూ.500 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,200కు పెరిగింది. డీఏపీతో పాటు మరికొన్ని నాన్-యూరియా ఎరువులపై కూడా సబ్సిడీని కేంద్రం పెంచింది. దీని వల్ల ఖజనాపై రూ.14,775 కోట్ల భారం పడనున్నది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సబ్సిడీల పెంపునకు ఆమోదం తెలిపింది. దేశంలో రైతులు యూరియా తర్వాత డీఏపీ (డై-అమ్మోనియం ఫాస్పేట్)ని అధికంగా వినియోగిస్తారు.డీఏపీపై సబ్సిడీని 140 శాతం పెంచాలని గత నెలలో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలు
అంతర్జాతీయంగా ధరలూ పెరుగుతున్నా రైతులకు పాత ధరకే డీఏపీని అందించాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచామని, దీని వల్ల రూ.2,400 ఉన్న ఒక్కో బస్తా రైతులకు రూ.1,200కే లభిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గత ఏడాది డీఏపీ బస్తా ధర రూ.1,700 ఉండగా కేంద్రం రూ.500 సబ్సిడీ ఇచ్చింది. దాంతో ఎరువుల కంపెనీలు రైతులకు ఒక్కో బస్తాను రూ.1,200కు విక్రయించాయి. అయితే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలతో డీఏపీ బస్తా ధర రూ.2,400కు పెరిగింది. పొటాషియం-పొటాసిక్ ఎరువులకు కూడా 2021-22 సంవత్సరానికి ఎన్బీఎస్ రేట్లను కేంద్రం పెంచింది. కిలోకి నైట్రోజన్కు రూ.18.78, ఫాస్పరస్కు రూ.45.32, పొటాష్కు రూ.10.11, సల్ఫర్కు రూ.2.37 చొప్పున సబ్సిడీ లభిస్తుంది.
ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్బీ) కార్పొరేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బోర్డు కింద ఉన్న 41 ఫ్యాక్టరీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏడు కార్పొరేట్ సంస్థలుగా విభజించారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని రక్షణమంత్రి రాజ్నాథ్ అన్నారు. సముద్ర గర్భ అన్వేషణ (డీప్ ఓషన్ మిషన్) ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.