లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇటాహ జిల్లా సర్దల్గాహ్ గ్రామంలో మహేంద్రసింగ్ (70) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి పంట చేను కాపలా కోసం వెళ్లిన మహేంద్రసింగ్.. బుధవారం తెల్లవారుజామును పంట చేనులోనే శవమై కనిపించాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహంపై బుల్లెట్ గాయాలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపినట్లు నిర్ధారణకు వచ్చారు.
అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. హంతకుడు ఎవరై ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతుడి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.