న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్కు మార్చిలో పంపిన 70 శాతం నమూనాలు బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ను కలిగి ఉన్నాయని PGIMER డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ తెలిపారు. ఈ జాతి కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తుందని, అన్ని వయసులవారిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. కొన్ని నమూనాలలో డబుల్ మ్యూటాంట్ స్ట్రెయిన్ కూడా ఉన్నదని వివరించారు.
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అలాగే 1,185 మంది మృత్యువాతపడ్డారు.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు.