తప్పిన ఏండ్లనాటి నీటి తిప్పలు
గ్రామస్తుల దాహం తీర్చిన మిషన్ భగీరథ
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 26: గతంలో తాగడానికి నీరు దొరకక అల్లాడిందీ గ్రామం.. గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు పడ్డారు ఈ గ్రామస్తులు.. ఇప్పుడా కష్టాలు లేవు. గ్రామస్తులు కడుపారా శుద్ధజలం తాగుతున్నారు. ఇప్పుడిప్పుడే అప్పటి క‘న్నీటి’ కష్టాలు మరిచిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం నూటికి నూరుశాతం సత్ఫలితాలనిస్తున్నది అనడానికి ఈ గ్రామమే నిదర్శనం. ఒకప్పుడు తాగునీటికి తండ్లాడిన హుజూరాబాద్ మండలం కాట్రపల్లి నేడు నిత్యం శుద్ధజలానికి నోచుకుంటున్న వైనంపై కథనం..
బావి తవ్వినా.. బోర్లు వేసినా..
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో మూడు వేల జనాభా ఉంటుంది. పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామస్తులు గతంలో నీటి ఎద్దడితో ఇబ్బందులు పడేవారు. గ్రామంలో రెండు మంచినీటి బావులున్నప్పటికీ వాటిలో నీరులేదు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి వారిది. పెద్దపాపయ్యపల్లి శివారులో కొంత భూమి కొనుగోలు చేసి నీటి ఎద్దడిని తీర్చడానికి బావి తవ్వించారు. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలోకి పైపులైన్ వేశారు. పైప్లైన్ ద్వారా వాటర్ ట్యాంక్కు నీటిని మళ్లించారు. అయినప్పటికీ గ్రామానికి నీళ్లు సరిపోకపోవడంతో ఆరు బోర్లు వేశారు. విద్యుత్ మోటర్లను బిగించి మినీ ట్యాంకులను నిర్మించి గ్రామానికి నీటిని సరఫరా చేసేవారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. వీటన్నింటికీ సుమారు నెలకు రూ.లక్ష విద్యుత్ బిల్లు వచ్చేది. పాలకవర్గం విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు చెల్లించడానికే బడ్జెట్ అయిపోయేది. గ్రామాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉండేది.
మిషన్ భగీరథతో తీరిన కష్టాలు
తెలంగాణ సర్కార్ వచ్చినంక గ్రామంలో పరిస్థితి మారింది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రయత్నం ఈ గ్రామంలో వంద శాతం ఫలించింది. ప్రస్తుతం ప్రతి ఇంటికీకి మిషన్ భగీరథ నీరు రావడంతో వారి కష్టాలు తొలిగాయి. బోర్లకు బిగించిన విద్యుత్ మోటర్లను తొలగించారు. పెద్దపాపయ్యపల్లి శివారులోని మంచినీటి బావి వాడకం నిలిపివేశారు. గ్రామంలో ఉన్న రెండు మంచినీటి బావుల నీటిని పల్లె పకృతివనం, నర్సరీలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిషన్ భగీరథ నీటీతోనే వాటర్ ట్యాంకులు నిండి ప్రతి ఇంటిలోకి పుష్కలంగా నీళ్లు రావడంతో గ్రామస్తులు ఆనందానికి అవధులు లేవు. గతంలో నెలనెలా వచ్చే విద్యుత్ రూ.లక్ష నుంచి రూ.30వేలకు తగ్గింది. దీంతో పంచాయతీకి రూ.70 వేలు మిగులుతుండడంతో గ్రామం అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నది.
గ్రామస్తుల నీటి కష్టాలు తీరాయి
మిషన్ భగీరథతో గ్రామస్తుల నీటి కష్టాలు తీరాయి. ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. మొదట మా గ్రామంలో నీటి సమస్య బాగా ఉండేది. పైప్లైన్కు లీకేజీలు లేకుండా చేసి, గేట్వాల్స్ బిగించాం. రూ.33లక్షల విద్యుత్ బకాయి ఉంది. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లు చాలా తగ్గింది. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.