కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు. టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులు ఆ పార్టీలో కొనసాగడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు. అయితే వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై తుది నిర్ణయం మమతా బెనర్జీనే తీసుకుంటారని వెల్లడించారు.
రాష్ట్ర గవర్నర్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్ను బీజేపీ కార్యాలయంగా మార్చారని కునాల్ ఘోష్ విమర్శించారు. గవర్నర్ బీజేపీ సభ్యుడిలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కుట్రలో ఆయన భాగమయ్యారని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వారు అంగీకరించడం లేదని విమర్శించారు. ఆర్టికల్ 355 లేదా 356 ద్వారా బ్యాక్ డోర్ ఎంట్రీ పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కునాల్ ఘోష్ మండిపడ్డారు. గవర్నర్ పాత్రకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి రెండు మూడు లేఖలు రాసినట్లు వెల్లడించారు.