‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నా. కెరీర్ పరంగా బాధపడిన సందర్భాలు లేవు. జయాపజయాలతో సంబంధం లేకుండా నా ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’ అని అన్నారు వైవీఎస్ చౌదరి. ‘దేవదాసు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ లాంటి చిత్రాలతో దర్శకనిర్మాతగా చక్కటి విజయాల్ని అందుకున్న వైవీఎస్ చౌదరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యాల కలబోతగా తెలుగు వారి పౌరుషాన్ని చాటిచెప్పే శక్తివంతమైన కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా. అన్ని హంగులతో కూడిన చక్కటి ప్రేమకథగా ఉండబోతుంది. ఈ సినిమా ద్వారా కొత్త నాయకానాయికల్ని పరిచయం చేయబోతున్నా. తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నా. దర్శకుడు అనేవాడు మూసధోరణికి పరిమితమైపోకుండా అన్ని రకాల కథల్ని తీయాలన్నది నా సిద్ధాంతం. ఆ ఆలోచనకు అనుగుణంగానే విభిన్నమైన కథాంశాలతో సినిమాల్ని రూపొందిస్తున్నా. మార్కెట్ లెక్కలు, అంచనాలు, క్యాలికులేషన్స్ను దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమాలు చేయను.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత తదుపరి సినిమా చిత్రీకరణ మొదలుపెడతా’ అని అన్నారు.