న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. భారత న్యాయ చరిత్రలో ఒకేసారి ఇంతమంది జడ్జిలను సిఫారసు చేయడం ఇదే తొలిసారి. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ కూడా ఈ కొలీజియంలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 112 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న కొలీజియం.. 68 మంది పేర్లను సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో 44 మంది బార్కు చెందిన వారుకాగా, 24 మంది జ్యుడిషియల్ సర్వీసుకు చెందినవారు. సిఫారసు చేసిన జాబితాలో పదిమంది మహిళలు కూడా ఉన్నారు. న్యాయమూర్తుల కొరతతో దేశంలోని వివిధ హైకోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం జడ్జిల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలను కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
మిజోరం నుంచి హైకోర్టు తొలి న్యాయమూర్తిగా మార్లీ వన్కుంగ్
మిజోరంలోని ఎస్టీ వర్గానికి చెందిన మహిళా జ్యుడీషియల్ ఆఫీసర్ మార్లీ వన్కుంగ్ను గౌహతీ హైకోర్టు జడ్జిగా కొలీజియం సిఫారసు చేసింది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే మిజోరం నుంచి హైకోర్టు తొలి న్యాయమూర్తిగా వాన్కుంగ్ చరిత్ర సృష్టించనున్నారు.