గౌహతి: భారతీయుడిగా నిరూపించేకునే లోపు అస్సాంకు చెందిన ఒక వృద్ధుడు మరణించాడు. హైలకండి జిల్లా అల్గాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మోహన్పూర్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల సుక్దేవ్ రీ దినసరి కూలీ. స్థానిక తేయాకు తోటలో కూలి పని చేసి రోజుకు రూ.110 సంపాదించే ఆయనను విదేశీయుడిగా ప్రకటించారు. దీంతో నిర్బంధ శిబిరంలో మూడేళ్లపాటు ఉన్నాడు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన సూచన మేరకు గత ఏడాది ఫిబ్రవరి 26న డిటెన్షన్ క్యాంపు నుంచి ఆయన విడుదలయ్యాడు.
కాగా, ఫారినర్స్ ట్రిబ్యునల్ ఉత్తర్వు అసంపూర్తిగా ఉందని గౌహతి హైకోర్టు నవంబర్ 3న గుర్తించింది. డిసెంబర్ 3న ఈ కేసును మళ్లీ విచారించాలని హైలాకండి ఫారినర్స్ ట్రిబ్యునల్ (FT)ని ఆదేశించింది. అయితే, రీ శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. దీంతో భారతీయ గుర్తింపును నిరూపించుకోవాలనే ఆయన చివరి కోరిక నెరవేరలేదు.
తన తండ్రి నిర్బంధ శిబిరం నుంచి విడుదైన తర్వాత కోర్టు ఆదేశాలను సవాల్ చేయడానికి ఇష్టపడలేదని సుక్దేవ్ రీ పెద్ద కుమారుడు 35 ఏండ్ల ధోను రీ తెలిపారు. ‘కొందరు సామాజిక కార్యకర్తలు ముందుకు రావడంతో మా నాన్న ఆశ కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఆదేశం గురించి విన్నప్పుడు తన గుర్తింపును నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. విదేశీయుడిగా తనపై వేసిన ముద్రపై మళ్లీ పోరాడతానని ఉత్సాహంగా చెప్పారు. తన పిల్లల తండ్రి బంగ్లాదేశీయుడు కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన కల నెరవేరలేదు’ అని ధోను అన్నారు.
అయితే, తన తండ్రి సుక్దేవ్ రీకు సంబంధించిన అన్ని పత్రాలతో డిసెంబర్ 3న హైలాకండి ఫారినర్స్ ట్రిబ్యునల్ ఎదుట హాజరవుతామని కుమారుడు ధోను తెలిపారు. తద్వారా మరణించిన తర్వాత అయినా తన తండ్రి భారతీయుడని నిరూపణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.