ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో గత మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 2018 నుంచి జూన్ 2021 వరకు జరిగిన 400 ఎన్కౌంటర్లలో మొత్తం 630 మంది ఉగ్రవాదులు హతమవగా 85 మంది భద్రతా సిబ్బంది అమరులైనట్లు చెప్పారు. ప్రభుత్వం తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని తెలిపారు. అదేవిధంగా భద్రతా చర్యలను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదులకు మద్దతునిచ్చే వారిపై భద్రతా దళాలు పటిష్ట నిఘా ఉంచినట్లు నిత్యానందరాయ్ తెలిపారు.