న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్తో జాగ్రత్త ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్రాల వారీగా వివరాలు వెల్లడించింది. ‘మహారాష్ట్రంలో నిత్యం కొత్తగా 61.8 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 17,864 కేసులు నమోదయ్యాయి. కేరళలో 1,970, పంజాబ్లో 1,463 కేసులు వెలుగు చూశాయి.
మార్చి 1వ తేదీ వరకు మహారాష్ట్రలో పాజిటివ్ రేటు 11 శాతంగా ఉంది.. ప్రస్తుతం ఇది 16 శాతానికి చేరింది. రోజువారీ పరీక్షల సంఖ్య పెంచకున్నా.. కేసులు పెరుగుతున్నాయి’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చవల్ సమావేశం నిర్వహించారు. వైరస్ విజృంభణను అడ్డుకోకపోతే దేశం మొత్తంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా రెండో వేవ్కు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సీఎంలకు సూచించారు.