న్యూఢిల్లీ: ఈ నెల 28న మరో ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. మే నెలలో మరో నాలుగు రాఫెల్స్ రానున్నట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పది రాఫెల్స్ అంబాటులోకి వస్తే ఐఏఎఫ్లో వీటి సంఖ్య 24కు చేరుతుందని చెప్పారు. దీంతో రాఫెల్స్ రెండో స్క్వాడ్రన్ ఏర్పాటుకు వీలవుతుందని వెల్లడించారు.
హర్యానాలోని పురాతన అంబాలా ఎయిర్ బేస్లో మిగ్ 21 విమానాలతో కూడిన గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ను 2016లో నిలివేశారు. అయితే నాలుగో తరానికి చెందిన అత్యాధునిక రాఫెల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ సమకూర్చుకోవడంతో గత ఏడాది సెప్టెంబర్లో ఆ స్క్వాడ్రన్ను పునరుద్ధరించారు. నంబర్ 17 స్క్వాడ్రన్లో ప్రస్తుతం 14 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ నెల 28న వచ్చే ఆరు రాఫెల్స్లో నాలుగు విమానాలను ఇందులో కలుపుతారు. దీంతో 18 విమానాలతో ఈ స్క్వాడ్రన్ సామర్థ్యం పూర్తవుతుంది.
కాగా, మిగతా రెండు విమానాలతో పశ్చిమ బెంగాల్లోని హసీమారా ఎయిర్ బేస్లో రెండో రాఫెల్ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేస్తారు. మే నెలలో వచ్చే మరో నాలుగుతోపాటు అనంతరం చేరే 12 రాఫెల్స్తో ఈ స్క్వాడ్రన్ సామర్థ్యం పూర్తవుతుంది. ఒప్పందం ప్రకారం 2022 నాటికి మొత్తం 36 రాఫెల్స్ సరఫరాను పూర్తి చేస్తామని ఫ్రాన్స్ పేర్కొంది. రూ.59,000 కోట్లతో వీటి కొనుగోలుకు భారత్ ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నది.