కోల్కతా: మానవుడు నాగరికత నేర్చి లక్షల సంవత్సరాలు గడిచింది. కానీ, సమాజంలో ఇప్పటికీ చాలా మంది అనాగరికంగానే వ్యవహరిస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు దేశంలో కోర్టులు, చట్టాలు ఉన్నా కొంతమంది అవేవీ పట్టించుకోవడం లేదు. పంచాయతీల పేరుతో దోషులను నిర్ధారించి అమానవీయ శిక్షలు విధిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం అలీపూర్ద్వార్ జిల్లాలోని పశ్చిమ చెంగ్మార్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత ప్రియుడిని వదిలేసి తిరిగి భర్త దగ్గరికి వచ్చి కాపురం చేస్తున్నది. దాంతో ప్రియుడు పంచాయతీ పెట్టడంతో పెద్ధ మనుషులు సదరు మహిళను వివస్త్రను చేసి ఊరేగించాలని తీర్పు ఇచ్చారు. ఆ మేరకు ఆమెను ఊరేగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.