జైపూర్: అది పండ్లు, కూరగాయలు అమ్మే మార్కెట్..! సాధారణంగా ఎప్పుడైనా రద్దీగా ఉండే ఆ మార్కెట్లో లాక్డౌన్ కారణంగా ఈ మధ్య జనం పలుచగా ఉంటున్నారు. సోమవారం సాయంత్రం రెండు బైకులపై ఆరుగురు దుండగులు ఆ మార్కెట్లోకి ప్రవేశించారు. వచ్చీరావడంతోనే ఆ మార్కెట్లోని ఓ షాప్ ఓనర్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ల వర్షం కురిపించారు.
అయితే, దుండగులు కాల్పులు మొదలుపెట్టగానే షాప్ ఓనర్ ప్రాణ భయంతో షాప్ లోపలికి పరుగుతీసి దాక్కున్నాడు. అయినా, దుండగులు షాప్వైపు కాల్పులు జరుపుతూ పారిపోయారు. రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలోని గుమన్పురా ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.