ఇండోర్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు మహమ్మారి సోకినవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలా అక్రమంగా ఇంజక్షన్లను అమ్ముతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మెడికల్ షాప్ ఓనర్ మరో ఇద్దరితో కలిసి రెమ్డెసివర్ ఇంజక్షన్లను నల్ల బజారుకు తరలిస్తున్నాడనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు బ్రాండ్లకు చెందిన 12 వయల్స్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఎగుమతి చేయడానికి మాత్రమే అని ముద్రించి ఉందని పోలీసులు తెలిపారు. వాటిపై ధర ముద్రించి లేనప్పటికీ, ఒక్కో ఇంజక్షన్ను రూ.20 వేలకు అమ్ముతున్నారని వెల్లడించారు. ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశామని, మెడికల్ షాపును సీజ్ చేశామన్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్లోని బాబు పుర్వా ప్రాంతంలో ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతున్నారని మిలటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మెడికల్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 265 వయల్స్ను సీజ్ చేశారు. మెడికల్ షాపు ఓనర్తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..