న్యూఢిల్లీ, జూన్ 6: ఆరోగ్యంపై 5జీ టెక్నాలజీ దుష్ప్రభావం చూపుతుందనేది తప్పుడు ప్రచారమని సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తెలిపింది. 5జీ టెక్నాలజీ సురక్షితమైనదని, ఈ విషయాన్ని అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలు బలపరుస్తున్నాయని పేర్కొంది. 5జీ ‘గేమ్ ఛేంజర్’ కానున్నదని, దాని వల్ల దేశ ఆర్థిక రంగానికి, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ సంస్థలకు సీవోఏఐ ప్రాతినిథ్యం వహిస్తుంది.
భారత్లో టెలికాం రంగంలో విధించిన ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పరిమితి.. అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమేనని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ పేర్కొన్నారు. ఇప్పటికే కఠిన నిబంధనలు భారత్లో అమలులో ఉన్నాయన్నారు. దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి జుహీ చావ్లా పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ లోపభూయిష్టంగా ఉందంటూ ఆమెతో పాటు ఇద్దరు సహ పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్ స్వాగతిస్తూ… ఇది వదంతులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు.