చెన్నై: తమిళనాడులో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించింది. మొత్తం 58 మంది బ్రాహ్మణేతరులను రాష్ట్రంలోని వివిధ హిందూ దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉండాలన్న ద్రవిడియన్ కలకు ఇది ముందడుగని ఆయన చెప్పారు. హెచ్ఆర్ అండ్ సీఈ విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై సీఎం స్టాలిన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ”తండ్రి పెరియార్ ఛాతిలోని ముల్లును తొలగించిన కళాకారుడి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 58 మంది పూజారులకు నియామక ఉత్తర్వులు ఇచ్చాను” అని రాశారు. ఈ 58 మంది బ్రాహ్మణేతర కులాలకు చెందినవారే. వాస్తవానికి అన్ని కులాలకు చెందిన వారు పూజారులుగా ఉండాలనే ఉద్దేశంతో డీఎంకే మాజీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చట్టం చేశారు. అయితే ఆ చట్టం అమల్లోకి రావడానికి చాలా సమయం పట్టింది.