ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
116 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గద్వాల, మే 8 : పేదింటి ఆడపడుచులకు సర్కారు అండగా నిలుస్తున్నదని, పెండ్లికి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 116 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆడపిల్లల పెండ్లిళ్లు చేయాలంటే నానా కష్టాలు పడేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులను గుర్తించి కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. టీకా వేసుకునే విషయంలో ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు దౌలు, మురళి, నాగరాజు, శ్రీనివాసులు, కృష్ణ, జములమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ సతీశ్కుమార్, నాయకులు సాయిశ్యాంరెడ్డి, నాగులుయాదవ్, అధికారులు పాల్గొన్నారు.