100 కోట్లతో మహిళా స్వావలంబనకు కొత్త పథకం
27 నుంచి యువతకు అంబులెన్స్ వాహనాలు
కుల వృత్తులవారికి రూ.5వేలతో పనిముట్లు
బీసీ యువతకు ఏసీ, బైక్ రిపేరింగ్లో శిక్షణ
వచ్చే ఏడాది నుంచి గురుకులాల్లో 119 జేసీలు
బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
ధాన్యం సేకరణ లక్ష్యం 1.32 కోట్ల టన్నులు
ఫిర్యాదులకు టోల్ఫ్రీ 1800 425 0033 / 1967
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి రూపకల్పన చేసిందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ‘కేసీఆర్ ఆపద్బంధు’ పేరుతో అర్హులైన బీసీలకు అంబులెన్స్ వాహనాలను అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఈ కొత్త పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. రూ.100 కోట్లతో మహిళల స్వావలంబనకు మరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసం నుంచి బీసీ సంక్షేమంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. బీసీల సంక్షేమానికి గతేడాదికన్నా ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.1,200 కోట్లు అదనంగా కేటాయించినట్టు తెలిపారు. 2020-21 బడ్జెట్లో బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 75 బీసీ కులాల ఆత్మగౌరవం ఇనుమడించేలా అనేక పథకాలను రూపొందించామని మంత్రి గంగుల చెప్పారు. గ్రామీణ మహిళలకు నిఫ్ట్లో శిక్షణ అందిస్తామన్నారు. 25 మంది సభ్యలను ఒక యూనిట్గా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్కరికి కుట్టుమిషన్లతోపాటు అన్నిరకాల కుట్టు యంత్రాలను అందిస్తామని వివరించారు. కులవృత్తుల వారికి రూ.5 వేలచొప్పున వృత్తి పనిముట్లను అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. రూ.300 కోట్లతో దాదాపు 50వేల మంది బీసీ యువతీయువకులకు ఏసీ, టూ వీలర్ రిపేర్ తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు పనిముట్లు అందజేసి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.
బీసీ గురుకులాల్లో జూనియర్ కాలేజీలు
దేశంలో ఎక్కడాలేనివిధంగా 281 బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్రంలో నడుపుతున్నామని, వీటికోసం బడ్జెట్లో రూ.620 కోట్లు కేటాయించామని మంత్రి కమలాకర్ తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 119 జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసి, 9,520 మంది విద్యార్థులను చేర్చుకుంటామని చెప్పారు. రాబోయే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం 11 బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, 2 ఇతర కేంద్ర, రాష్ట్రస్థాయి పోటీపరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వీటికి అదనంగా శుక్రవారం సిరిసిల్లలో మరో నూతన బీసీ స్టడీ సర్కిల్ను మంజూరు చేశామని చెప్పారు. ఆడబిడ్డల వివాహానికి ఆసరా కోసం తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకానికి బడ్జెట్లో రూ.1,850 కోట్లు కేటాయించినట్టు గంగుల తెలిపారు. 2014 నుంచి 3.50 లక్షల మంది వధువులకు రూ.3,353 కోట్లు అందజేశామన్నారు.
1.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రైతుల నుంచే కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా పౌరసరఫరాలశాఖ చర్యలు చేపడుతున్నదని మంత్రి తెలిపారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 20 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ యాసంగిలో 1.32 లక్షల టన్నుల పంట పండుతుందని అంచనావేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇందుకు అవసరమయ్యే రూ.20 వేల కోట్ల కోసం పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని తెలిపారు. రైతులు ధాన్యంలో తేమశాతం 17 శాతం మించకుండా చూడాలని, కరోనా నిబంధనలు అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు 1800 425 0033 / 1967 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉన్నతాధికారులు అలోక్ కుమార్, మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం