బ్రిటన్ : యూకేలో కరోనా వ్యాక్సిన్ కలకలం సృష్టిస్తోంది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న 30 మందికి రక్తం గడ్డకట్టగా.. ఇందులో ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని యూకే మెడికల్ రెగ్యులేటర్ శనివారం తెలిపింది. ఇప్పటికే ఆందోళన మధ్య దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేశాయి. ఇప్పటికే యూకేలో 18.1 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సమయంలో రక్తగడ్డం కట్టిన ఏడుగురు వ్యక్తులు మృతి చెందినట్లు యూకే హెల్త్ రెగ్యులేటరి సంస్థ ప్రకటించింది. అయితే, టీకా తీసుకోవడంతోనే జరిగిందా? మరేదైనా కారణమా? అని పూర్తిగా తేలలేదని తెలిపింది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సెరిబ్రల్ వెయిన్ థ్రోంబోసిస్ లక్షణాలతో 22 మంది, ఇతర థ్రోంబోసిస్ కారణాలతో ఎనిమిది మంది బాధపడుతున్నారు. అయితే, ఫైజర్-బయో ఎంటెక్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని హెల్త్ రెగ్యులేటరీ తెలిపింది. దీనిపై యూకే రెగ్యులేటర్ చీఫ్ డాక్టర్ జూన్ రైన్ మాట్లాడుతూ ఈ విషయమై సమగ్ర సమీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం కొనసాగించాలని సూచించారు. యూకే, యూరోపియన్ మెడికల్స్ ఏజెన్సీలు రెండూ రక్తం గడ్డకట్టడానికి, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఇలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయని పేర్కొన్నాయి. పెరుగుతూ వస్తున్న ఆందోళన మధ్య పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీపై ఆంక్షలు విధించాయి. శుక్రవారం నుంచి నెదర్లాండ్ 60 ఏళ్లలోపు వారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయడాన్ని నిలిపివేసింది. జర్మనీ సైతం ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఫ్రాన్స్తో సహా అనేక దేశాలు వయో పరిమితులు విధించగా.. డెన్మార్క్, నార్వే వ్యాక్సిన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేశాయి. వ్యాక్సిన్ సురక్షితమని ప్రకటించిన యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఈ నెల 7న నవీకరించిన డేటా వివరాలను ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తగా సెరిబ్రల్ వెయిన్ థ్రోంబోసిస్ కేసులు 62 నమోదు కాగా.. వాటిలో యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ ఏరియాలోనే 44 ఉన్నాయి.
దీనిపై బ్రిటన్ ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయంలోని మెడికల్ మైక్రోబయాలజిస్ట్ పాల్ హంటర్ మాట్లాడుతూ టీకాలు, రక్త గడ్డకట్టడం మధ్య సంబంధం ‘యాధృచ్చిక అనుబంధం’ కావచ్చునని తాను మొదట్లో భావించానన్నారు. అనేక దేశాల్లో పెరుగుతున్న కేసులతో అందరూ ఆస్ట్రాజెనెకా వైపే చూస్తున్నారన్నారు. అయితే రోగి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. గత నెలలో యూఎస్లో వ్యాక్సిన్ 76శాతం ప్రభావంతంగా ఉందని తేలింది. యూకేలో ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేస్తుండగా.. ఇప్పటి వరకు యూకేలో 31 మిలియన్లకుపైగా మొదటి డోసులు వేశారు.
ఛత్తీస్గఢ్లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు