పాట్నా, సెప్టెంబర్ 17: బీహార్లో ఏదైనా ఓ బ్యాంకులో ఖాతా ఉంటే పోయేది. లైఫ్ సెటిల్ అయిపోయేది.. కొన్ని రోజులుగా బీహార్లో కొందరి ఖాతాల్లో జమైతున్న డబ్బును చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. బ్యాంకు ఖాతాలో పొరపాటున కోట్లు జమైన మరో ఘటన బీహార్లో చోటు చేసుకొన్నది. ముజఫర్పూర్ జిల్లాలో రామ్ బహదూర్ షా అనే రైతు పెన్షన్ ఖాతాలో రూ.52 కోట్లు వచ్చి పడ్డాయి. పెన్షన్ డబ్బులను తీసుకొనేందుకు వినియోగదారుల సేవా కేంద్రానికి(సీఎస్పీ) వెళ్లగా అక్కడి ఆపరేటర్ చెక్ చేసి ఖాతాలో 52 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పడంతో బహదూర్ షా షాక్ అయ్యారు. ఆ డబ్బునంతా బ్యాంకు తిరిగి తీసుకొంటుదని తెలిసి.. ‘మేం రైతులం. అందులో కొంచెమైనా తమకు ఇవ్వాలి. జీవితాంతం హాయిగా బతుకుతం’ అని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. బీహార్లో ఇటీవల ఓ స్కూల్ విద్యార్థి ఖాతాల్లో ఏకంగా రూ.900 కోట్లు క్రెడిట్ అయ్యాయి. మరో విద్యార్థికి ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ఖాతాలో రూ.5 లక్షల పడ్డాయి. అవి ప్రధాని మోదీ ఇచ్చారని, తిరిగివ్వవనని చెప్పడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా పలువురి ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ అవుతుండటంతో బీహార్ ప్రజలు తమ ఖాతాలను చెక్ చేసుకొంటున్నారు.