సూర్యాపేట, జూన్ 25(నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో రైతుబంధు సాయం పంపిణీ 98శాతం పూర్తయ్యింది. వానకాలం సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఎకరాకు రూ.5వేల చొప్పున సూర్యాపేట జిల్లాలో 2,52,659 మంది రైతులకు రూ. 307,01,42,118 వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. వివిధ కారణాలతో కొంతమంది రైతులకు రైతుబంధు రాకపోగా మరో 4వేల మంది రైతులకు రూ. 5 కోట్లు అందాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ డబ్బులు అందుతాయని అధికారులు చెబుతున్నారు. రైతుబంధు సాయం అందుకున్న రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని దుక్కులు దున్ని విత్తనాలు సైతం వేస్తున్నారు.
తీరిన రైతుల గోస
సమైక్య రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రైతులు నానా కష్టాలు పడ్డారు. సాగునీరు లేక… విద్యుత్ రాక… ఉన్న భూమిలో కొద్దోగొప్పో సాగు చేద్దామనుకుంటే పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. వానకాలం ప్రారంభమైందంటే చాలా రైతులు మొదట నాగళ్ల వైపు కాకుండా అప్పుల కోసం ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలను తాకట్టు పెట్టడమో… భూమి తనకా పెట్టడమో.. లేక పండించిన పంటను మీకే అమ్ముతామని వ్యాపారుల చుట్టూ తిరగడమో చేసేవారు. నానా కష్టాలుపడి సాగుచేస్తే పండిన పంటతో పోల్చి లెక్కలు చూసుకుంటే అన్నీ పోనూ అప్పులే మిగిలేవి.
అందుకే అప్పట్లో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు సాగుకు పుష్కలంగా సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్ … సీజన్ ప్రారంభానికి ముందే ఎరువులు, విత్తనాలు ఇలా అన్నీ సకాలంలో అందుతున్నాయి. అన్నింటికీ మించి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధును ప్రారంభించి ఎకరాకు రూ.4వేల చొప్పున అందించారు. 2018 యాసంగి నుంచి సాగుకు సాయాన్ని మరో వెయ్యి పెంచి రూ.5వేలు అందిస్తున్నారు. ఫలితంగా సాగుపై రైతులకు ఆసక్తి పెరిగింది. పెట్టుబడి కోసం ఎవరినీ ఆశించాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతులు సంతోషంగా సాగు చేయగా.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది.
అందిన పెట్టుబడి సాయం
ఈ వానకాలంలో రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 25 వరకు ప్రతి రైతుకూ ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 2,52,659 మంది రైతులకు రూ.307,01,42,118 రైతుల ఖాతాల్లో జమ చేశారు. వాస్తవానికి జిల్లాలో మొత్తం 2,62,911 మంది రైతులకు రూ. 313.65 కోట్లు అందించాల్సి ఉంది. గత సీజన్లో సుమారు 4వేల మంది బ్యాంకు ఖాతాలు వివిధ కారణాలతో ఆన్లైన్ కాకపోగా ఈ ఏడాది మరో 1700ల మంది రైతులవి నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిలో కొంతమంది రైతులు చనిపోయిన వారు, మరి కొందరు భూములను అమ్ముకున్న వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇలా నిలిచిపోయిన వారు కాకుండా మరో 4వేల మంది రైతులకు దాదాపు 5కోట్ల రూపాయలు అందాల్సి ఉండగా మరో రెండు మూడు రోజుల్లో అవి వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
ఉత్సాహంగా సాగుపనులు
మూడేళ్లుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నట్లే ఈ ఏడాది కూడా పెట్టుబడి సాయం రావడంతో రైతులు సంతోషంగా సాగు పనులు ప్రారంభించారు. వానకాలంలో తొలకరి జల్లులు, వర్షాల కోసం ఎదురు చూడకుండా ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. ఆరుతడి పంటలు వేయాలనుకునే వారు తమ పొలాల్లో ఉన్న పైపులైన్లు మరమ్మత్తులు చేసుకోవడం, అవసరమున్న వారు మోటర్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులు ముందే చేసుకున్నారు. వ్యవసాయానికి ఇంతటి సాయం అందించే ఇలాంటి ప్రభుత్వం, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని జీవితకాలం తమ గుండెల్లో పెట్టుకుంటామని రైతులు పేర్కొంటున్నారు.