లక్నో: జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ జనాభా బిల్లు ముసాయిదాలో పేర్కొన్నది. వారికి ప్రభుత్వం ఉద్యోగం కూడా రాదు. అంతేకాదు ప్రభుత్వ సబ్సిడీ కూడా ఇవ్వమని ఆ ముసాయిదాలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ బిల్లును కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఒకవేళ అదే బిల్లును అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తించేలా చేస్తే .. అప్పుడు దాదాపు 50 శాతం మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. ఓ సర్వే ప్రకారం.. ప్రస్తుతం యూపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న బీజేపీ నేతల్లో 50 శాతం మందికి ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.
యూపీ అసెంబ్లీ సమాచారం ప్రకారం.. 397 మంది ఎమ్మెల్యేల బయో ప్రొఫైల్స్ ఆ రాష్ట్ర వెబ్సైట్లో ఉన్నాయి. దాంట్లో 304 మంది అధికార బీజేపీ పార్టీకి చెందినవారి డేటా ఉన్నది. ఆ సంఖ్యలో సగం అంటే, సరిగ్గా 152 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు లేదా అంత కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండడం గమనార్హం. ఒక ఎమ్మెల్యేకు అత్యధికంగా 8 మంది పిల్లలు ఉన్నారు. మరో ఎమ్మెల్యేకు ఏడు మంది పిల్లలు ఉన్నారు. ఇక ఆరు మంది పిల్లలు కలిగి ఉన్నవారిలో 8 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్యేలకు అయిదేసి, 44 మంది ఎమ్మెల్యేలకు నాలుగురేసి, 83 మందికి ముగ్గురేసి సంతానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్నవారిలో 103 మంది యూపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో జనాభా నియంత్రణ బిల్లును బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటు మెంబర్స్ బిల్లు రూపంలో ఆ బిల్లును ప్రవేశపెడుతారు. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే.. జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన గోరఖ్పూర్ ఎంపీ రవికిషణ్కు నలుగురు పిల్లలు ఉండడం విశేషం. లోక్సభ వెబ్సైట్ ప్రకారం.. 168 మంది సిట్టింగ్ ఎంపీలు.. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ సంతానం కలిగి ఉన్నారు. దాంట్లో 105 మంది బీజేపీ సభ్యులే ఉన్నారు.