హైదరాబాద్ : కరోనా టీకా కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు. అయితే టీకాల సరఫరా విషయంలో తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్ర్టాలు చేస్తున్న ఫిర్యాదుల పట్ల సుచిత్ర ఎల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ర్టాలకు కొవాగ్జిన్ను షిప్మెంట్స్లో పంపామని ట్విటర్లో పేర్కొన్నారు. తమ ఉద్దేశాలపై కొన్ని రాష్ర్టాలు చేస్తున్న ఫిర్యాదులు తమకు నిరుత్సాహం కలిగిస్తున్నాయన్నారు. కొవిడ్ కారణంగా 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేరని, అయినప్పటికీ మీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు.
అయితే ఈ ట్వీట్పై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలోనే 50 మంది ఉద్యోగులకు కరోనా వస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ టీకా పని చేయడం లేదా? అని కొందరు అడిగారు. లేక వారికి టీకా ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాత్కాలిక నియామకాలు జరుపొచ్చు కదా? అని సూచించారు. మరో నెటిజన్ స్పందిస్తూ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మీ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.