తయారీ సంస్థలకు రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలు
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, మే 12: అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ తయారీకి ఊతమిచ్చేందుకు రూ.18,100 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ కేటాయింపులు జరిగాయి. కాగా, ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్పై తమ ఈ జాతీయ కార్యాచరణ.. దేశ, విదేశాల నుంచి రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని క్యాబినెట్ భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వ్యక్తం చేశారు. 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ తయారీ సాధన లక్ష్యంగానే ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్న ఆయన.. అధిక ఉత్పత్తి, అమ్మకాలు జరిపే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. అంతేగాక తమ ఈ విధానం అంతర్జాతీయంగా భారత్ను పోటీదారుగా నిలబెట్టగలదని, ఎగుమతులను పెంచగలదన్న ఆశాభావాన్నీ ఈ సందర్భంగా మంత్రి కనబరిచారు. కొత్త తరం అడ్వాన్స్డ్ స్టోరేజీ టెక్నాలజీలే ఏసీసీలు. ఇవి విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్గాగానీ లేదా కెమికల్ ఎనర్జీగాగానీ నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చగలవు. కాగా, కేంద్రం ప్రోత్సాహకాలపట్ల హర్షం వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఆధారిత వాహన తయారీదారులు.. దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు తగ్గగలవన్న ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇదిలావుంటే ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ (క్యూఎఫ్సీఏ) మధ్య జరిగిన ఎంవోయూకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం అకౌంటింగ్లో ఇరు సంస్థల మధ్య సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయనున్నది.