రాయ్పూర్: చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో మిస్సైన కోబ్రా కమాండో కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో మిస్సైన కమాండో తమ దగ్గర ఉన్నట్లు మావోలు స్థానిక జర్నలిస్టులతో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ కమాండోను గుర్తించేందుకు స్థానిక గ్రామస్థులను కలుస్తున్నట్లు చత్తీస్ఘడ్ పోలీసులు చెప్పారు. పోలీసు ఇన్ఫార్మర్లను యాక్టివేట్ చేశారు. 210 కోబ్రా బెటాలియన్లోని కానిస్టేబుల్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ .. ఎన్కౌంటర్ తర్వాత ఆచూకీ లేడు. సీఆర్పీఎఫ్కు ఎలైట్ యూనిట్గా కోబ్రా కమాండోలు పనిచేస్తున్నారు. సుక్మా, బస్తర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందారు. జవాను మిస్సైనట్లు ఇప్పుడు ద్రువీకరించలేమని, ఆ జవానుకు సంబంధించిన ఫోటోలను మావోలు ఇంకా రిలీజ్ చేయలేదని, అతన్ని గుర్తంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
తన తండ్రిని విడిచిపెట్టాలని కమాండో రాకేశ్ కుమార్తె కోరింది. అయిదేళ్ల కుమార్తె ఏడుస్తున్న వీడియో ఒకటి రిలీజై అయ్యింది. తన తండ్రిని విడిచి పెట్టాలని కోరుతూ ఏడుస్తూ ఆమె వేడుకున్నది. జమ్మూలో ఉన్న కమాండో రాకేశ్ భార్య మీనూ .. సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయంతో మాట్లాడింది. కానీ తమకు ఎటువంటి సమాచారం తెలియదని వారు చెప్పినట్లు మీనూ పేర్కొన్నది. తన భర్తను వదిలిపెట్టాలని మావోలను మీనూ కోరింది. తన భర్త పదేళ్లు దేశం కోసం సేవ చేశారని, ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తను కాపాడాలని ఆమె వేడుకున్నది. ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఈ విషయాన్ని చర్చించాలని ఆమె కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరింది.