కర్ణాటకలోని మైసూర్లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విద్యార్థినిపై సామూహికంగా లైంగిక దాడి చేసిన నిందితులతో లింక్ ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు తెలిపారు.
విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. తనతో పాటు ఉన్న వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఆరుగురు నిందితులు పరారిలో ఉన్నారని.. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ గాలిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వాళ్లు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన దినసరి కూలీలు అని డీజీపీ వెల్లడించారు. అరెస్ట్ చేసిన వాళ్లలో ఒక మైనర్ ఉన్నాడని.. అతడి వయసు 17 ఏళ్లు అని డీజీపీ చెప్పారు. అయితే.. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. కారకులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటి? అంటూ కర్ణాటక డీజీపీపై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఇది చాలా సెన్సిటివ్ కేసు.. మా వద్ద టెక్నికల్, సైంటిఫిక్ సాక్ష్యాలు ఉన్నాయి. అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటాం.. అని డీజీపీ తెలిపారు.
22 ఏళ్ల ఎంబీఏ చేస్తున్న యువతిపై మంగళవారం సాయంత్రం మైసూర్లోని చాముండీ హిల్స్ వద్ద ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తనతో ఉన్న తన ఫ్రెండ్ను కూడా తీవ్రంగా కొట్టారు. తను, తన ఫ్రెండ్ ఇద్దరూ అడవిలోకి వెళ్లడం చూసి వాళ్లను ఫాలో అయి.. అడవిలోకి వెళ్లాక.. వాళ్లపై దాడి చేశారు. ప్రస్తుతం యువతి, యువకుడు.. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.