హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ను దేవుడిగా కీర్తించారు ఓ తండ్రి. గొంతువ్యాధితో బాధపడుతున్న తన కూతురుకు ఉచితంగా ఆపరేషన్ చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన పింగీతం అవినాష్ కు మార్తె అక్షయ (2) ‘సిస్టిహైబ్రోమా’ అనే గొంతు వ్యా ధితో తీవ్రంగా బాధపడుతున్నది. అక్షయ దైన్యస్థితిని తెలుపుతూ, ఆమెను ఆదుకోవాలని అవినాష్ స్నేహితుడు శ్రీనివాస్ ధర్మా.. ఈ నెల 10న మంత్రి కేటీఆర్కు ట్వీట్చేశాడు. ఆ ట్వీట్ను చూసి మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ‘అక్షయ పరిస్థితిని ఫొటోలో చూస్తేనే ఎంతో బాధనిపిస్తున్నది. ఆ చిన్నారి ఎలా భరిస్తున్నదో’ అంటూ అన్నీతానై అపరేషన్ చేయించారు. అక్షయ కోలుకొని సురక్షితంగా ఇంటికి తిరిగిచేరడంతో అవినాష్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ‘నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద పాప వైష్ణవి (4), చిన్నపాప అక్షయ. నేను, నా భార్య సుమలత వ్యవసాయ కూలీలం. గొంతు వాపుతో అక్షయ చాలా ఇబ్బందిపడ్డది. చాలా దిక్కుల తిరిగిన. పైసలు బాగా ఖర్చు అయితయన్నరు. ట్విట్టర్లో పెట్టుడుతో అంతా కేటీఆర్ సార్ ఆఫీసువాళ్లే చూసుకున్నరు. దవాఖానకు ఏడ్చుకుంటు పోయి.. సంతోషంగా ఇంటికొచ్చిన. మా ఇంటి దీపాన్ని కాపాడిన దేవుడు కేటీఆర్ సార్కు చెయ్యెత్తి మొక్కుతున్నా. ఆయన రుణం తీర్చుకోలేనిది’ అంటూ అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ హర్షం
అక్షయ కోలుకొని ఇంటికి చేరడం సంతోషదాయకమని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఆపరేషన్కు ముందు అక్షయ దిగిన ఫొటోలతోపాటు ఆ చిన్నారి కోలుకొని తల్లిదండ్రులతో ఇంటికి చేరిన ఫొటోలను ఆ ట్వీట్లో పొందుపర్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘నేను ఇచ్చిన హామీని నెరవేర్చినందు కు సంతోషంగా ఉన్నది. అక్షయ వేగంగా కోలుకుంటుంది అని మంత్రి కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.