నలంద : బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలంద జిల్లా ఛబీలాపూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఇరువర్గాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ ఓ వర్గం భూమిని దున్నుతుండగా.. మరో వర్గానికి చెందిన వారు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నలంద ఎస్పీ హరిప్రశాంత్ తెలిపారు. భూ వివాదంపై ఇరువర్గాలు కోర్టులోనూ పోరాడుతున్నారని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి.