న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే ఓ విధానాన్ని రూపొందించింది. దేశంలో కరోనా మహమ్మారికి ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ‘రోల్ ఆన్- రోల్ ఆఫ్’ విధానంలో క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా గమ్యస్థానాలకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు సర్క్యులర్లో పేర్కొంది. ఇందుకు రైల్వే ఫీజులను వసూలు చేయనుంది. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో వైద్యసేవల కోసం ఆక్సిజన్ కొరత ఉందని, సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని సహాయాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పతాక స్థాయికి చేరుకుంది. పలు చోట్ల ఆక్సిజన్ అందక పలువురు రోగులు సైతం మృతి చెందిన పరిస్థితులూ ఉన్నాయి. వైరస్ బారినపడి రోగులకు ఆక్సిజన్ అవసరం ఉండడంతో డిమాండ్ పెరిగింది. డబ్బుతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు రైల్వేల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేసేందుకు అనుమతించాలని మహారాష్ట్ర సర్కారు కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు రైల్వేశాఖ లిక్విడ్ మెడికల్ ఆక్సిజను సరఫరా చేసేందుకు అనుమతులిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..