లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షం స్థానికంగా పెను విషాదం మిగిల్చింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘజియాబాద్లోని సిహానీగేట్ పోలీస్ స్టేషన్ ఏరియా రాకేష్ మార్గ్లోని తేన్ సింగ్ ప్యాలెస్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ కిరాణాషాపు యజమాని ఎండ తగులకుండా తన షాపు ముందు రేకుల కప్పు ఏర్పాటు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా కరెంటు తీగ కొంచెం జారి రేకులకు అనుకుంది. ఆ రేకులకు ఆనుకుని ఒక ఇనుప టెలిఫోన్ స్తంభం ఉన్నది. బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులు ఆ దుకాణంలో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చిన్నారులిద్దరూ ఇనుప స్తంభాన్ని టచ్ చేయడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందారు.
పక్కనే ఉన్న మరో ముగ్గురు వారిని కాపాడేందుకు ప్రయత్నించగా వారు కూడా విద్యుత్ షాక్తో స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతులు జానకి (35), ఆమె కూతురు సుభి (3), లక్ష్మీశంకర్ (24), ఖుషి (10), సిమ్రాన్ (11)గా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.