న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తొలిదశ కరోనా విజృంభణను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సమయంలో రెండోదశ తుఫాన్లా వచ్చిపడిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నదని పేర్కొన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే నిపుణులు అందిస్తున్న సలహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ర్టాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్ కీ బాత్’లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముప్పై నిమిషాలపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ వర్కర్లతో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభం నుంచి ప్రజలందరూ త్వరలోనే బయటపడుతారని ధీమా వ్యక్తం చేశారు. మహమ్మారిని ఓడించడమే దేశప్రజల ముందున్న సవాల్ అని అన్నారు. వ్యాక్సిన్లపై అపోహలను నమ్మవద్దని, అందరూ టీకాలు వేయించుకోవాలన్నారు. 45 ఏండ్లు పైబడిన అందరికీ టీకాలను ఉచితంగా అందజేస్తామన్నారు. ఎంత ఎక్కువ మంది వైరస్బారిన పడుతున్నారో, అదే స్థాయిలో కోలుకుంటున్నారని గుర్తు చేశారు. మహమ్మారిని తరిమి కొట్టడానికి ‘దవాయి భీ.. కడాయి భీ’ (ఔషధమూ తీసుకోవాలి.. జాగ్రత్తలూ పాటించాలి’) అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.