అప్పర్మానేరు నుంచి మిడ్మానేరు వరకు 13 చెక్డ్యాంలు నిర్మిస్తాం
వచ్చే జూన్ వరకు పనులు పూర్తి చేస్తాం
ఎగువమానేరుకు జలకళ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
ఇల్లంతకుంట, వేములవాడ, సిరిసిల్ల, గంభీరావుపేటలో పర్యటన
బండి సంజయ్ తీరుపై ధ్వజం
సిరిసిల్ల /ఇల్లంతకుంట, ఏప్రిల్ 19: ‘2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల రైతులు ఒక్కటే అడిగిన్రు. నర్మాల చెరువు నింపు బిడ్డా అన్నరు. ఎర్రటి ఎండల్లో గోదావరి జలాలతో ఎగువ మానేరుకు జలకళ తీసుకురావడం మహాద్భుతం. ఎగువ మానేరు నుంచి మిడ్మానేరు మధ్యన 13 చెక్ డ్యాంలు నిర్మిస్తున్నాం. జూన్ వరకు పూర్తి చేస్తాం. మానేరువాగును సజీవనదిగా మారుస్తాం. ఇది మరో మహా అద్భుతంగా నిలుస్తుంది. నిండైన అప్పర్ మానేరును చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవడం జన్మధన్యమైనట్లుగా ఉన్నది’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఇల్లంతకుంట, వేములవాడ, సిరిసిల్ల, గంభీరావుపేటలో పర్యటించిన ఆయన, ఎగువమానేరు వద్ద జలాలకు పూజలు చేసి, కనులనిండా తిలకించారు. సీఎం కేసీఆర్ కృషితో అద్భుత జల దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని, మండువేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఇల్లంతకుంట మండలం రాష్ర్టానికే వాటర్ జంక్షన్గా మారిందని చెప్పిన ఆయన, ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, వారికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ తరానికే కాదు.. భావితరాలకు బాసటగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండల్లో ఎక్కడో గోదారిని ఇక్కడి నర్మాలకు తీసుకువచ్చి ఎగువ మానేరుకు జలకళ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కితాబిచ్చారు. ఎగువ మానేరు నుంచి మిడ్ మానేరు మధ్య 13 చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని, జూన్ లో పూర్తయి ఇక్కడి నుంచి అక్కడిదాక మానేరు వాగు జీవనదిలా మారి మరో మహా అద్భుతం జరుగబోతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూ రు రవీందర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. ముందుగా ఇల్లంతకుంట మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసి, వేములవాడలో వందపడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని దవాఖానను సందర్శించారు. చివరగా గంభీరావుపేటలో నిండుకుండలా మారిన ఎగువమానేరులోని జలాలకు జలహారతి పట్టారు. మొదట ఇల్లంతకుంటలో మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా అల్లాడిన ఇల్లంతకుంట మండలం ఇవ్వాళా తెలంగాణ రాష్ర్టానికే వాటర్ జంక్షన్గా మారిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని చెప్పారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్తో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయని, మండు వేసవిలోనూ రాష్ట్రంలోని అన్ని చెరువులు మత్తడులు దూకుతున్నాయన్నారు. నర్మాల ఎగువమానేరు సైతం నీటితో కళకళలాడుతున్నదని, ఇది కేవలం సీఎం కేసీఆర్ ఘనతేనని కీర్తించారు. జిల్లాలోని భూగర్భ జలాలు పెరిగి కేవలం 6 మీటర్ల ఎత్తుకు ఎగబాకడంతోపాటు ఈ అంశం కలెక్టర్లకు పాఠ్యాంశంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నపూర్ణ ప్రాజెక్ట్ వద్ద ఎత్తిపోతల ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణకు సాగు, తాగు నీరందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అప్పట్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన ప్రతి సందర్భంలో ఇల్లంతకుంట ప్రజలు అండగా ఉన్నారని, భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇల్లంతకుంట మండలంలో 30 పడకల దవాఖాన నిర్మాణానికి, సిద్దిపేట నుం చి ఇల్లంతకుంట దాకా ఫోర్లేన్ రోడ్డు నిర్మాణానికి త్వర లో శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లెల్ల నుంచి పెద్దలింగాపూర్ మీదుగా డబుల్ రోడ్డు నిర్మాణం, మండల కేంద్రం నుంచి గాలిపెల్లి, పొత్తూరు దాకా డబుల్ రోడ్డు నిర్మాణానికి త్వరలో భూమిపూజ చేస్తామని ప్రకటించారు.
భూములు పోయిన బాధ మాకూ తెలుసు..
ఎస్సారార్, అన్నపూర్ణ ప్రాజెక్ట్ల నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. నిర్వాసితుల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అని, మేం కూడా అనుభవించామని చెప్పారు. సీఎం కేసీఆర్ తాతలకు సంబంధించిన స్థలం ఎగువమానేరు నిర్మాణంలో పోయిందని, మిడ్మానేర్ నిర్మాణంలో మా అమ్మమ్మ గ్రామమైన కొదురుపాకలో స్థలం కోల్పోయామని గుర్తు చేసుకున్నారు. ఈ బాధలు తెలిసే భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ మెరుగైన ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించారని వివరించారు.
నిధులెన్ని తెచ్చారో సంజయ్ చెప్పాలి?
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు బండి సంజయ్ ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న సంజయ్కు దమ్ముంటే అభివృద్ధితో పోటీపడాలని, చేతనైతే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా తేవాలని సవాల్ విసిరారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని యువతను మతం పేరుతో రెచ్చగొట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ను విమర్శిస్తే ఓట్లు రాలవని, ప్రజోపయోగ పనులు చేయాలని సూచించారు.
రామన్న కోసం ఎదురుచూస్తున్నరు
100 పడకల దవాఖానను సిద్ధం చేయాలి
వేములవాడ, ఏప్రిల్ 19: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో పూర్తికావస్తున్న 100 పడకల దవాఖానను 10రోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం దవాఖాన భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి హెల్త్ విభాగం ఏఈ, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగెకరాల స్థలంలో 79వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20కోట్లతో నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తక్షణమే వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలని రాష్ట్ర హెల్త్ విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా సూచించారు. దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ప్రారంభించి తక్షణమే వైద్యసేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వేములవాడ మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.
కొవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 19: కరోనా వ్యాప్తి గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లా దవాఖానలో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య సిబ్బందితో కొవిడ్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించి, విలేకరులతో మాట్లాడారు. గతేడాది కరోనా టైంలో తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా రోగులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లా దవాఖానలోని ఆక్సిజన్ లిక్విడ్ ట్యాంకు ద్వారా అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. కొవిడ్ రోగులకు అవసరమైన రెమ్డెసివిర్, వెంటిలేటర్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ వార్డులో వంద పడకలతో సేవలు అందిస్తున్నారని, త్వరలోనే అదనంగా మరో 60పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తామని, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీఎస్ఎండీసీ ద్వారా టెస్టింగ్ కిట్స్ మరిన్ని తీసుకువస్తామన్నారు. తిప్పాపూర్లోని 100 పడకల దవాఖానను పది రోజుల్లోగా అందుబాటులోకి తెస్తామని, కేసుల తీవ్రత ఆధారంగా సర్దాపూర్ వ్యవసాయ కళాశాలతో పాటు బైపాస్ రోడ్డులోని నర్సింగ్ కళాశాలలో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 3280 పాజిటివ్ కేసులు ఉన్నాయని, మరణాలశాతం తక్కువగా ఉన్నదని వివరించారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో ఉన్న 45ఏండ్లకు పైబడిన లక్షా 24వేల మందికి మొదటి వ్యాక్సినేషన్ డోస్ పూర్తి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ విభాగంలో వ్యాక్సినేషన్ వేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్కు సూచించారు.
గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలి
జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చిన జిల్లా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లా గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూంతో పాటు ఎన్ఆర్ఐ దంపతులు జోగినపల్లి స్రవంతి-కిరణ్ వితరణ చేసిన ప్రొజెక్టర్, టాస్క్ సెంటర్ను ప్రారంభించారు. రీడింగ్ రూంలో విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. సౌకర్యాలు ‘ఎలా ఉన్నాయి..? సిబ్బంది సహకరిస్తున్నారా..?’ అంటూ కేటీఆర్ అడుగగా, సౌకర్యాలు బాగున్నాయని మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని వసతులు కల్పిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ ఉన్నారు.
భవిష్యత్ తరాలకు బాసటగా కేసీఆర్
గంభీరావుపేట, ఏప్రిల్ 19: ఈ తరం కాదు భవిష్యత్ తరాలకు బాసటగా ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని, ఎర్రటి ఎండల్లో ఎక్కడో గోదారిని ఇక్కడి నర్మాలకు తీసుకువచ్చి ఎగువ మానేరుకు జలకళ తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలకు హారతి ఇచ్చి నీటిలో పూలు చల్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గంభీరావుపేటతో పాటు ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల రైతులు ఒక్కటే అడిగారని, నర్మాల చెరువు నింపు బిడ్డా అని కోరారన్నారు. అది నెరవేరిందని, కొండపోచమ్మ నుంచి కాళేశ్వర జలాలను కూడవెళ్లి ద్వారా ఎగువ మానేరుకు తీసుకువచ్చి జలకళ తేవడం మహా అద్భుతమన్నారు. ఇంకా ఎగువ మానేరు నుంచి మిడ్ మానేరు మధ్య 13 చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని, జూన్లో పూర్తయి ఇక్కడి నుంచి అక్కడిదాకా మానేరు వాగు సజీవనదిగా మారి మరో మహా అద్భుతం జరుగబోతున్నదని కేటీఆర్ చెప్పారు. నిండిన మానేరునూ చూస్తే చాలా సంతోషంగా ఉందని, ప్రాంత రైతుల రుణం తీర్చుకోవడంతో జన్మధన్యమైనట్లున్నదని సంతోషపడ్డారు. అనంతరం దేశాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీపీలు వంగ కరుణ, జనగామ శరత్రావు, పిల్లి రేణుక, మాసన, జడ్పీటీసీలు కొమిరిశెట్టి విజయ, గుండం నర్సయ్య తదితరులు ఉన్నారు.