సదాశివపేట, ఏప్రిల్ 9: భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలకు తోడు ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి చిన్నారి కూతుళ్లకు విషం తాగించి, తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓచిన్నారి మృతిచెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మంగళి శివకుమార్ హైదరాబాద్కు చెందిన లలితతో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైనట్లు పేర్కొన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు కావ్యశ్రీ(5), చిన్న కూతురు నవ్యశ్రీ (3) ఉన్నారు. పళ్లైన నాటి నుంచి హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు సంవత్సరాల క్రితం సొంతూరు ఆత్మకూరుకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. కాగా, కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య లలిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్లోని పుట్టింటికి వెళ్లింది.
అయితే, గురువారం శివకుమార్ హైదరాబాద్లోని అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవపడి ఇద్దరు కూతుళ్లను తీసుకుని ఆత్మకూర్కు వచ్చాడు. ఈ క్రమంలోనే గుళికల మందు కొనుగోలు చేసి కూల్డ్రింక్లో కలిపి చిన్న కూతురుకు తాగించి, తానూ తాగాడు. పెద్ద కూతురు తాను తాగనని రోడ్డుపైనే గట్టిగా ఏడవడంతో గమనించిన స్థానికులు వారిని ఆత్మకూరులోని ఇంటి వద్దకు తీసుకువెళ్లి శివకుమార్ తల్లిదండ్రులకు అప్పగించారు. అదే రాత్రి శివకుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉదయం తిరిగి ఇంటికి వచ్చాడు. చిన్నకూతురు పరిస్థితి విషమంగా మారడంతో ఆందోళన చెందిన శివకుమార్ తల్లిదండ్రులు ఏమి జరిగిందని అతడిని అడుగగా, గుళికలమందు కూతుర్లకు తాగించి, తాను తాగినట్లు తెలిపాడు.
అనంతరం అతడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే సదాశివపేట ప్రభుత్వదవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. మార్గమద్యలోనే చిన్న కూతురు నవ్యశ్రీ(3) మృతి చెందిందని, పెద్ద కూతురు కావ్యశ్రీ గుళికలు కలిపిన కూల్డ్రింక్ తాగకపోవడంతో ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తండ్రి శివకుమార్ పరిస్థితి విషమించడంతో సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. శివకుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
నాచగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం