మనీలా, జూలై 4: ఫిలిప్పీన్స్లో ఘోరప్రమాదం జరిగింది. 96 మందితో వెళ్తున్న సైనిక విమానం ‘సీ-130’ కుప్పకూలి పేలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం సులూ ప్రావిన్స్లోని జోలో ఎయిర్పోర్టు సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. విమానంలో ఉన్న 42 మంది సైనికులు చనిపోయారు. ఈ విమానం కూలిన సమయంలో నేల మీద ఉన్న ఆరుగురిపై పడింది. వీరిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. విమానంలో వెళ్తున్నవారిలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది, మిగతావారంతా సైనికులు. సైనికుల్లో చాలా మంది కొత్తవారని, ఇటీవలే వారికి ప్రాథమిక శిక్షణ పూర్తైందని అధికారులు తెలిపారు. సులూ ప్రావిన్స్లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి వారంతా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
49 మంది సైనికులను కాపాడినట్టు వివరించారు. మిగతావారి కోసం గాలిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. విమానం కూలిన వెంటనే కొంత మంది సైనికులు అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకొన్నట్టు ప్రత్యక్షంగా చూసినవాళ్లు చెప్పారు. విమానం ల్యాండ్ అవడానికి రన్వే కోసం చూస్తుండగా ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. అయితే, విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణం ఏమిటనేది తెలియలేదు. సైనిక సహాయంలో భాగంగా ఈ విమానాన్ని అమెరికా ఇటీవలే ఫిలిప్పీన్స్కు అందజేసింది.