ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
చొప్పదండి, మే 19: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో బుధవారం ఆయన మండలంలోని 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం మాదని, ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా లాంటి సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రూ. లక్షా 116 కట్నంగా ఇస్తూ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా మారారాని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, నేరుగా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాచర్ల వినయ్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.