మారిన గ్రామ రూపురేఖలు
ఇంటింటికీ మిషన్భగీరథ నీళ్లు
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
అద్దంలా సీసీ రోడ్లు, పరిసరాలు
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
ఆకట్టుకుంటున్న పచ్చదనం,పరిశుభ్రత
అందుబాటులోకి రైతు వేదిక, డంపింగ్యార్డు
ఆలేరురూరల్, మార్చి 28 : ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామపంచాయతీని నందనవనంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తున్నది. ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, అధికారులు విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పక్కా ప్రణాళికతో పారిశుధ్య పనులు చేస్తూ స్వచ్ఛతకు నిలయమైంది. గ్రామంలో సీసీరోడ్లు అద్దంలా కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలోవీధిలైట్లు గ్రామానికి సరికొత్తశోభను తీసుకొచ్చాయి. చెత్త వేసేందుకు డంపింగ్యార్డు, రైతు వేదిక పనులు పూర్తయ్యాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది.
పల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆలేరు మండలం కొలనుపాక గ్రామ రూపురేఖలనే మార్చింది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు అధికారులు ఉత్సాహంగా ప్రభుత్వం చేపట్టిన లక్ష్య సాధనకు గ్రామంలో విస్తృతంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంలో కొలనుపాక ప్రగతి దారుల్లో పయనిస్తున్నది. గ్రామంలోని వీధుల్లో అద్దంలా సీసీ రోడ్లు, రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో గ్రామానికి కొత్త శోభను అందిస్తున్నాయి. ఇంటి ముందు చెట్లు గ్రామంలో ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణాన్ని అందిస్తున్నాయి. చివరి మజిలీ ఇబ్బందులను తప్పించిన వైకుంఠధామం, చెత్త వేసేందుకు డంపింగ్యార్డు, తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు వర్మీకంపోస్టు షెడ్డు, దుర్గమ్మగుడి ఆవరణలో పల్లె ప్రకృతి వనం.. ఇలా అన్ని అందుబాటులోకి వచ్చాయి. పల్లె ప్రగతితో కొలనుపాక గ్రామం ఆదర్శంగా మారింది.
గ్రామంలో అభివృద్ధి పరుగులు
పల్లె ప్రగతి కార్యక్రమం అధికారుల్లో కదలిక, ప్రజల్లో చైతన్యం తెచ్చింది. దీంతో ఊరు బాగుండాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా పల్లె ప్రగతి వైపు అడుగులు వేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడంతో కొలనుపాకలో మెరుగైన సౌకర్యాల కల్పన జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుండటంతో అభివృద్ధి దారిలో పయనిస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా రూ.12.40 లక్షలతో వైకుంఠధామం, రూ.8లక్షల 60వేలతో ట్రాక్టర్, రూ.2.40లక్షలతో వర్మీకంపోస్టు షెడ్డు, రూ.50లక్షలతో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, మిషన్భగీరథ ట్యాంక్ నిర్మాణంతోపాటు స్థానికంగా ఉన్న నీటి బోరుతో ఇంటింటికి మంచినీటి సౌకర్యం ఉన్నది.
సమస్యలు పరిష్కారం
మా ఊర్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నారు. గ్రామాలు ఆదర్శంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రత్యేక కార్యాచరణతో పల్లెల ముఖచిత్రం మారుతున్నది. తాగడానికి, ఇతర పనులకు నీళ్లు మంచిగా వస్తున్నాయి. పల్లె ప్రగతితో గ్రామంలో మార్పులు తీసుకురావడం చాలా సంతోషంగా ఉన్నది.
-బెదరబోయిన శంకర్, కొలనుపాక గ్రామస్థుడు
చాలా పనులు చేశాం..
రెండేండ్లలో గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేశాం. ఇంటి ముందు పెంట కుప్పలు, చెత్తాచెదారం వేసిన వాళ్లకు నోటీసులు జారీ చేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతి వనం, కంపోస్టుయార్డు, డంపింగ్యార్డు, నర్సరీల ఏర్పాటుతోపాటు సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వాటర్ట్యాంక్, మంచినీటి శుద్ధి కేంద్రంతోపాటు గ్రామంలో దశలవారీగా పనులు చేస్తున్నాం.
ఇవి కూడా చదవండి
దేశంలో 4 కోట్ల డొక్కు వాహనాలు!